Tuesday, January 3, 2012

తాలిబాన్ ఆఫీసు తెరవడానికి కతార్ అంగీకారం, ఇండియాపై పాక్ పైచేయికి మార్గం!

ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అభ్యంతరాలను తోసి పుచ్చుతూ కతార్ రాజధాని ‘దోహా’ లో కార్యాలయం తెరవడానికి ఆఫ్ఘన్ తాలిబాన్ కి అనుమతి దొరికింది. ఈ మేరకు కతార్, ఆఫ్ఘన్ తాలిబాన్ ల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ లతో తాలిబాన్ జరపబోయే శాంతి చర్చలకు ఈ కార్యాలయం అనుమతి దోహదపడుతుందని అమెరికా ఆశపడుతోంది.
కతార్ లో తాలిబాన్ కార్యాలయం తెరవడానికి నిజానికి అంగీకారం ఎన్నడో కుదిరింది. కాని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తీవ్రంగా అభ్యంతరం తెలపడంతో నిర్ణయం చర్చలు కొనసాగాయి. హమీద్ కర్జాయ్ కి ఏమి చెప్పి శాంత పరిచారో తెలియదు గానీ ఆయన ఇప్పుడు నోరు మెదపడం లేదు. ఓ వైపు తన ప్రభుత్వానికి కతార్ లో రాయబార కార్యాలయం ఉండగానే మరో వైపు తన ప్రభుత్వంపై పోరాడుతున్న తాలిబాన్ కి కార్యాలయం తెరుచుకోవడానికి అనుమతివ్వడం సబబు కాదని కర్జాయ్ అభ్యంతరం తెలిపాడు. ఒక దేశం నుంది ఒక రాయబార కార్యాలయం మాత్రమే ఉండవలసి ఉండగా తాలిబాన్ కార్యాలయం మరో రాయబార కార్యాలయంగా మారుతుందని హమిద్ కర్జాయ్ అమెరికా, కతార్ లకు అభ్యంతరం తెలిపాడు.
కార్యాలయం తెరవడంతో పాటు గ్వాంటనామో బే జైలులో ఉన్న తాలిబాన్ ఖైదీలు నలుగురిని కతార్ కి తరలించి వారిని గృహ నిర్భంధంలో ఉంచాలని కూడా గతంలో ఒప్పందంలో ఒక అంశంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి కూడా కర్జాయ్ అభ్యంతరం తెలిపాడు. ఇలా తాలిబాన్ ఖైదీలను కతార్ తరలించే ప్రతిపాదన ఇప్పుడు ఏమయ్యిందీ తెలియరాలేదు.
తాలిబాన్ ప్రతినిధి జబీఉల్లా ముజాహిద్ ఒప్పందం సంగతి మంగళవారం విలేఖరులకు తెలిపాడు. తమ కార్యాలయం ఎప్పుడు ప్రారంభం అయ్యేదీ ఆయన చెప్పలేదు. ఈ కార్యాలయం అంతర్జాతీయ సమాజంతో చర్చలకు వినియోగిస్తామని ముజాహిద్ తెలిపాడు. కతార్ ప్రభుత్వంతోనూ, ఇతర సంబంధిత పార్టీలతోనూ చర్చలు జరిపాక కార్యాలయం తెరవడానికి ఒప్పందం కుదిరిందని ముజాహిద్ తెలిపాడు. అమెరికా, హమీద్ కర్జాయ్ లు ‘సంబంధిత పార్టీలు’ అయిందీ లేనిదీ వివరించలేదు.
ఆఫ్ఘనిస్ధాన్ లొ దురాక్రమణ యుద్ధం చేస్తున్న అమెరికా, దాని మిత్ర దేశాలకు కతార్ లో తాలిబాన్ కార్యాలయం తెరవడం ముఖ్యమైన అంశంగా ఉంటూ వచ్చింది. ఆఫ్ఘన్ యుద్ధంలో ఎదురు దెబ్బలు తింటున్న అమెరికా, నాటో లకు (మంచి) తాలిబాన్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం కీలకాంశంగా మారింది. గతంలో అనేక సార్లు చర్చల పేరుతో అమెరికా మోసపోయింది. బూటకపు తాలిబాన్ నాయకులతో చర్చలు జరిపి ముఖ్యమైన ఆఫ్ఘన్ నాయకులను కర్జాయ్ కోల్పోయాడు. ఒక దశలో తాలిబాన్ తో చర్చలు జరిపే బదులు పాకిస్ధాన్ తోనే చర్చలు జరపడం మేలని ప్రకటించి పాకిస్ధాన్ ఆగ్రహానికి గురయ్యాడు.
పాకిస్ధాన్ మాత్రం ఆఫ్ఘనిస్ధాన్ భవిష్యత్తుకి సంబంధించి ఎటువంటి పధకం రూపొందించినప్పటికీ అందులో తనకు ప్రధాన పాత్ర ఉండాలని కోరుతోంది. పాకిస్ధాన్ పాత్రను సాధ్యమైనంత తక్కువ చేయడానికీ, వీలయితే అసలే లేకుండా చేయడానికీ అమెరికా అనేక ఎత్తులు వేస్తున్నది. ఇది గమనించిన పాకిస్ధాన్ ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధంలో అమెరికాకి సహకరించకుందా తలనొప్పులు తెచ్చిపెట్టడానికి ప్రయత్నించింది. అందులో భాగంగా అమెరికా, పాకిస్ధాన్ ల మధ్య గత కొద్ది సంవత్సరాలుగా సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి.
పాక్ జోక్యాన్ని నివారించడానికి అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ దేశం సహకారం లేకుండా తాలిబాన్ ను చర్చల బల్ల వద్దకు తేవడం సాధ్యం కాలేదు. పట్టుకున్నట్లు నాటకమాడుతూ తాలిబాన్ లోని హక్కాని గ్రూపు నాయకులు కొందరిని పాకిస్ధాన్, అమెరికాకి అప్పజెప్పాకే చర్చల వ్యవహారం ఊపందుకుంది. ఆఫ్ఘనిస్ధాన్ లో తమ పని ముగిసిందని అమెరికా చెప్పుకోవాలంటే అక్కడ స్ధిరత్వం నెలకొందని ప్రపంచానికీ, తన ప్రజలకూ అమెరికా చూపించవలసి ఉంటుంది. అది జరగకుండా ఆఫ్ఘనిస్ధాన్ లొ అమెరికా ఓడిపోయి ఇంటికి చేరుకుందన్న అపప్రధ దానికి మిగులుతుంది.
ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ ను తనకు అనుకూలమైన రీతిలో, తన మర్యాదకూ గౌరవానికీ భంగం కలగకుండా ముగించడానికి అమెరికాకి ఈ చర్చల నాటకం అవసరం అయింది. దానిలో పాకిస్ధాన్ కూడా ఒక పాత్రధారి.  చర్చలలో పాక్ పాత్ర ఉంటున్న నేపధ్యంలో భవిష్య ఆఫ్ఘనిస్ధాన్ లో ఇండియా పాలకవర్గాల పాత్రకు మంగళం పాడవలసిన అవసరం రావచ్చు. అదే జరిగితే దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాలలో ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధానికి సంబంధించి ఇండియాపై పాకిస్ధాన్ పైచేయి సాధించినట్లే.

No comments:

Post a Comment