Monday, January 31, 2011

చిరంజీవికి జనమంటే లోకువ!?

    చిరంజీవి తన బామ్మరిది అల్లు అరవింద్ దుష్టమంత్రాంగం మైకంలో పడి తను మంచి లీడర్గా ఎదిగే అవకాశాలను తనే చేజేతులా పోగొట్టుకుంటున్నాడు. రాజకీయాలను కూడా ఓ పక్కా సినిమా వ్యవహారంగా చూడటమంటే తనంతటతనే ఒక నాయకుడిగా ఎదిగే మార్గాన్ని మూసేసుకుంటున్నాడన్నమాట! మొన్నటి తన ఎన్నికల వైఫల్యానికి సరైన కారణాలు అన్వేషించకుండా, అవి దిద్దుకునే ప్రయత్నాలు చేయకుండా చిరంజీవి మరో తప్పు చేస్తున్నారు!
     సినిమాల నుంచి రాజకీయాల్లోకి రావడానికి ముందు ఎంటీయార్ చాలా ఆలోచించారు. తనకున్న అధ్బుతమైన ఫాలోయింగ్ ను మాత్రమే నమ్ముకోలేదు ఆయన. అప్పుడు భ్రష్టుపట్టిపోయిన కాంగ్రెస్ రాజకీయాలతో జనం విసిగిపోయి ఉన్నారు. గ్యాప్ పూడ్చటంలో ప్రతిపక్షాలు కూడా విఫలమయ్యాయి. అందుకని ఆ స్పేస్ తనకు బాగా ఉపయోగపడింది. మొత్తం ఆయన కమ్యూనిటీయే కాకుండా మార్పు కోరిన జనమంతా బ్రహ్మరథం పట్టారు. కేవలం వీటినే పట్టించుకోకుండా ఆయన రెండు రూపాయల బియ్యం వంటి హామీలను, జాతి ఆత్మగౌరవం వంటి కదిలించగలిగిన నినాదాలనూ ఆయన నమ్ముకున్నారు. అన్నింటికీ మించి ఆయన పదునైన ప్రసంగాలు, కాంగ్రెస్ పైన ఎక్కుపెట్టిన తీవ్ర విమర్శలు కూడా పనికొచ్చాయి. తను టికెట్లు ఇచ్చినప్పుడు ఎక్కువగా రాజకీయంగా వెనుకబడిన వర్గాలు, చదువుకున్నవారు, కొత్తవారికి ప్రాధాన్యం ఇచ్చారు. "నిష్కళంక" అనే ముద్ర కోసం ప్రయతించారు. మరి చిరంజీవి విషయంలో ఏం జరిగింది? 
     తను రాజకీయాల్లో చేరే విషయంలో విపరీతమైన హైప్ క్రియేటైంది. ఎప్పుడూ అంత హైప్ క్రియేట్ కావడం సినిమాల్లో ఓపెనింగ్ కలెక్షన్లను పెంచుతుంది కానీ ఎక్కువరోజులు సినిమా నడవటానికి ఉపయోగపడదనేది చిరంజీవికి తెలియంది కాదు. ఒకవైపు పాతుకుపోయిన వైఎస్, మరోవైపు కేడర్ బలమున్న చంద్ర బాబు ఉన్న స్థితిలో చిరంజీవి తనకు పెద్ద స్పేస్ క్రియేట్ కావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని గమనిచలేకపోయారు. ముందే చెప్పినట్టు హైప్ కారణంగా సభలకు జనం విపరీతంగా వచ్చారు కానీ దాన్ని వోట్ల రూపంలోకి మార్చుకునే విషయంలో అన్నీ తప్పుటడుగులే పడ్డాయి. దీనికి అరవింద్ ప్రధానకారకుడు. గెలిచేవారికి టికెట్లకు ఇచ్చి ముందు ఎన్నికల పరీక్షలో గెలవడానికి ట్రై చేయాల్సింది పోయి అమ్మకానికి పెట్టారు. ఎవడిని నిలబెట్టినా గెలుస్తారనే భ్రమో, డబ్బు వచ్చినప్పుడు ఎందుకు వద్దనాలనే సినిమా బుద్దో కానీ అక్కడే పార్టీ సగం భ్రష్టుపట్టింది. పసలేని ప్రసంగాలు, ప్రభావం చూపించలేని నినాదాలతో చిరంజీవి తన అభిమానులనే నిరాశపరిచాడు. నిజానికి తనకొచ్చిన వోట్లు, సీట్లు కూడా ఎక్కువే అని రాజకీయ విశ్లేషకుల విస్మయం. పోనీ తరువాతైనా పార్టీని నిలబెట్టడానికి ట్రై చేశాడా అంటే అదీ కరువైంది. సబ్జెక్ట్ లేకపోవడం, పార్టికి ఏ విషయంలోనూ ఓ వైఖరి లేకపోవడం, ఎవరినీ నమ్మలేకపోవడం, తనకే సీరియస్ నెస్ లేకపోవడం, అనుభవలేమి కారణంగా తెలంగాణాపై యూటర్న్ తీసుకోవడం వంటి అనేకానేక లోపాలతో ఒక్కొక్కరే వదిలిపోయారు. రాజకీయ నిష్క్రియాపరత్వం ఎంతటి పెద్ద పార్టీనైనా (విపక్షంలో ఉన్నప్పుడు) దెబ్బ తీస్తుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టికి పీఆర్పీ అవసరం వచ్చిందో అరవింద్ మళ్లీ క్రియాశీలమయ్యారు. డబ్బు వచ్చే చాన్స్, పదవి దక్కే చాన్స్ కళ్లముందు డాన్స్ చేస్తూ కనిపించాయి. ఇక్కడ తను సొంతంగా విధాన నిర్ణయాలు తీసుకునే సత్తా లేని చిరంజీవి మళ్లీ తప్పుటడుగులు వేస్తున్నారు. 
* ప్రస్తుతం రాష్ట్రంలో కొంత పొలిటికల్ స్పేస్ కనిపిస్తోంది. తనకు నిజంగా రాజకీయ భవిష్యత్తుపై ఆలోచన ఉంటే తల లోపాలు సరిదిద్దుకుని విస్తృతంగా జనంలోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఎంతసేపూ ఇప్పుడున్న సంఖ్యాబలంతోనే ఎంత "లబ్ది" పొందాలనే ఆశ తప్ప ఒంటరిగా బలపడాలనే ఆలోచన కనిపించడం లేదు.
* ఒకవేళ విలీనానికి అంగీకరిస్తే ఇప్పుడున్న ఎమ్మేల్యేలతోపాటు మరికొన్ని సీట్లు తను అడుగుతాడు. అది కాంగ్రెస్, పీఆర్పీ రెండింటికీ నష్టమే. పరోక్షంగా జగన్ తలపై పాలు పోయడమే.
* కేవలం వ్యూహాత్మక మద్దతుకే పరిమితమై కేబినెట్లో చేరినా కాంగ్రెస్ పైన కనిపించే వ్యతిరేకత ప్రభావాన్ని కూడా పీఆర్పీ భరించాల్సి ఉంటుంది.
* ఇప్పుడు దక్కబోయే దానిపైనే అరవింద్ ఆశ. తనకు రాజ్యసభ అందులో ఒకటి. ఒకసారి కాంగ్రెస్ పార్టికి మద్దతు ఇచ్చినా, విలీనం జరిగినా తరువాత ఆ పార్టీ ఎలా ఆడుకుంటుందో చిరంజీవికి తెలుసుకోలేకపోతున్నాడు.
* పక్కా సమైక్యవాదితో పొత్తు, మద్దతు, విలీనం ద్వారా కాంగ్రెస్ తెలంగాణాలో మరింత బలహీనపడటం ఖాయం.
ఈ వైఫల్యాల మాటెలా ఉన్నా కాంగ్రెస్ తో చేతులు కలపడాన్ని చిరంజీవి నైతికంగా ఎలా సమర్థించుకోగలరు? ఆయనకు వేసిన 69 లక్షల వోట్లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేసినవే కదా? "మార్పు కోసం" పేరిట రాజకీయం చేసిన తను ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు...? ఊరూరా కాంగ్రెస్, టీడీపీ శ్రేణులతో పోరాడిన ఆయన అభిమానులకు ఇది శరాఘాతం కాదా...? "పిచ్చి" ఆవేశంతో ఎన్నికల ప్రసంగాలు చేసిన కొమురం పులి ఇప్పుడు ఎటు పోయాడు...? చిర్నజీవి సీఎం కావలని రాజకీయాల్లో చేరినా... ప్రజలు మాత్రం ఇప్పుడే తనకు సీఎం అయ్యే అర్హత లేదని, కానీ ఇంకా కొంత కష్టపడాలనీ తీర్పు చెప్పి కొన్ని వోట్లు వేశారు. అవి తక్కువ వోట్లేమీ కావు. ఇప్పుడు తను పార్టీని నడిపించలేక, ఏదో ఇలా కాంగ్రెస్ లో చేరి కథ నడిపించేద్దామని ప్రయత్నించడం ఆయన రాజకీయ అనుభవరాహిత్యాన్నే బయటపెడుతోంది. అంతేకాదు ఆయన ప్రస్తుత వైఖరి తనకు వోట్లేసిన వారిని ఒకరకంగా అవమానించడమే అవుతుంది. రాజకీయకోణంలో ఇది కరెక్టో కాదోననే చర్చ ఎలా ఉన్నా నైతికత కోణంలో మాత్రం అసమంజసం!

No comments:

Post a Comment