వ్రతం చెడ్డా ఫలం దక్కడమంటే ఇదేనేమో. మొత్తానికి ముఖ్యమంత్రి కాలేకపోయినా చిరంజీవికి ఏదో గౌరవప్రదమైన స్థానం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఒకానొక సమయంలో చిరంజీవి తన పార్టీని రద్దు చేసేస్తారని, మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోతారని పుకార్లు జోరుగా వినిపించాయి. ప్రజారాజ్యం దుకాణం బంద్ అని, పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తారని మీడియాలో...ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలలో కొంతకాలంగా ఎన్నో కథనాలు వచ్చాయి. దానికి తగ్గట్లుగా తెలంగాణాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు(అనిల్, మహేశ్వరరెడ్డి) ఉన్నా లేనట్లే. రాయలసీమలోని ఇద్దరు ఎమ్మెల్యేలు(శోభానాగిరెడ్డి, కాటసాని) జగన్ వర్గంలో చేరిపోయారు. ఇక ఉన్న 14మందిలో కూడా నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి కూడా జగన్ వర్గంమనిషే. ఇక నికరంగా చూస్తే 13మంది ఉన్నట్లు.
ఒక విషయంలో చిరుని మెచ్చుకోవాలి. రాష్ట్రంలో అంత భారీస్థాయిలో ఆసక్తిరేపుతూ సంచలనాత్మకంగా రాజకీయాల్లోకి వచ్చి, తీరా ఎన్నికల్లో తుస్సుమన్న తర్వాత – ఎవరయినా ఛీ మనకెందుకు ఈ రొచ్చు అని వెనక్కి పారిపోయి ఉండేవారేమో(వెనకకు వెళితే సినిమాఫీల్డులో మరో ఐదారేళ్ళు కెరీర్ కొనసాగించే అవకాశాలున్నాయి కాబట్టి). అయితే ఆ పనిచేయకుండా అంటిపెట్టుకుని ఉన్నందుకు చిరంజీవికి మంచి ఫలితమే దక్కుతున్నట్లుగా అనిపిస్తోంది...తాజా పరిణామాలు చూస్తుంటే. రాజకీయాలలో అపజయం ఎదురయినా వదలబోనని, విజయం సాధించేవరకు పోరాడతానని మొదటినుంచీ(రాజకీయరంగ ప్రవేశం వార్తల వస్తున్న దగ్గరనుంచి) చెబుతూ వస్తున్న చిరంజీవి, దానికి కట్టుబడిఉండటమే ఈ సత్ఫలితానికి కారణం అయిఉండొచ్చు.
గత ఎన్నికల్లో చిరంజీవి పరాజయానికి కారణాలపై ఇప్పటికే ఎంతో చర్చ జరిగినప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి మరోసారి చూద్దాం.
1. రాజకీయాల్లోకి తనంతతానుగా కాక బంధుమిత్రుల ప్రోద్బలంతో అన్యమనస్కంగా ప్రవేశించడం, సంకల్పం బలంగా లేకపోవడం
2. పార్టీ నిర్మాణాన్ని అల్లు అరవింద్ ఒక సినిమా నిర్మాణంలాగా జరపడం.
3. ఉవ్వెత్తున వచ్చిన ఆదరణను, అభిమానాన్ని క్రమపద్ధతిలో నిలుపుకోకుండా నిర్లక్ష్యం చేయడం.
4. పార్టీకి థింక్ ట్యాంక్, ఐడియాలజీ లేకపోవడం.
5. పార్టీలోకి వచ్చిన మేధావులను సక్రమంగా వినియోగించుకోకుండా, పార్టీ వ్యవహరాలను సొంత కుటుంబ వ్యవహారంలాగా నడపడం.
6. పర్యటించిన ప్రతిచోటికీ వేల, లక్షలమంది ప్రజలు వస్తే...అలాంటి అపూర్వ అవకాశాన్ని చేజిక్కించుకుంటూ ప్రసంగాలతో ఆకట్టుకోవలసిందిపోయి, జనం వచ్చారని సంబరపడి తృప్తిపడిపోయారు
7. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ మంచి లక్ష్యాలతో నడుపుతున్నప్పటికీ ప్రత్యర్ధులు వాటిమీద లేనిపోని ఆరోపణలు చేస్తే, వాటిని తిప్పికొట్టకపోగా, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రజలు తమ వెనకే ఉన్నారని విర్రవీగారు.
8. అరవింద్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని ప్రజలందరూ నమ్ముతున్నా, చిరంజీవి మాత్రం నమ్మకపోవడం...కనీసం డేమేజ్ కంట్రోల్ చేయకపోవడం.
9. పార్టీ టిక్కెట్ల కేటాయింపులో అవగాహనాలోపం.
10. ప్రత్యర్ధుల ప్రాపగాండాని ఎదుర్కోవడానికి, తమ వాదనను వినిపించుకోడానికి సొంత మీడియా ఉండాలన్న ప్రాధమిక సూత్రాన్ని కూడా పట్టించుకోకపోవడం.
ఏది ఏమైనా...ప్రజారాజ్యం అస్తిత్వంమీద ప్రజలందరికీ అనుమానాలు రేకెత్తుతున్న ఈ సమయంలో, ఆ పార్టీని ఇంకా అంటిపెట్టుకునిఉన్న వీరాభిమానులు కూడా పునరాలోచన పడుతున్న ప్రస్తుత తరుణంలో, కాంగ్రెస్ నుంచి ఈ అవకాశం రావడం చిరుకు ఎంతోకొంత శుభ పరిణామమేనని చెప్పొచ్చు. పీఆర్పీకి కొంత పునరుజ్జీవం లభించినట్లయింది. నానాటికీ ఇమేజ్ దిగజారిపోతున్న ఆ పార్టీ కోలుకోడానికి అవకాశం దొరికింది. ఊళ్ళలో ఉన్న పీఆర్పీ, చిరంజీవి అభిమానులు కాస్త తలెత్తుకుని తిరగగలిగేటట్లయింది. దీనిని నిలబెట్టుకోడానికి చిరంజీవి ప్రయత్నించాలి ఇప్పటికైనా మేలుకుని వ్యూహాలను మార్చుకుని... రాజకీయరంగప్రవేశం చేసి తాను సాధించిందేమిటి,ఇకముందు ఏమిచేయాలి అనేదానిపై చక్కటి అవగాహనకొస్తే మంచిది. వీటన్నటికంటే అరవింద్ మీద ఆధారపడకుండా, అతనిని పక్కనబెట్టి సొంత వ్యక్తిత్వంతో, సొంత ఆలోచనలతో ముందుకు సాగాలి.
No comments:
Post a Comment