Saturday, November 26, 2011

సచిన్ వందో సెంచరీ ఎందుకలా చేతులెత్తేస్తున్నాడు?

సచిన్ వ్యక్తిగతంగా ఒత్తిడికి గురవుతున్న సమయంలోనే, అభిమానుల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి ఉందనే విషయాన్ని కూడా ఆయన మరిచిపోయినట్లు లేరు. అందుకే అతను వందో సెంచరీకి కొత్తగా ఆడుతున్న ఆటగాడిలా వ్యవహరిస్తున్నాడు.
సొంత గడ్డపై సచిన్ టెండూల్కర్ తన వందో సెంచరీ సాధించి వంద బంగారు నాణేలను అందుకోవడమే కాకుండా కోట్లాది భారత అభిమానుల గుండెల్లో హర్షాతిరేకాలు నింపుతాడని విశ్వాసం గట్టిగానే ఉండింది. కానీ వెస్టిండీస్ బౌలర్ రాంపాల్ కోట్లాది మంది భారతీయులకు గుండె కొతనే మిగిల్చాడు. సెంచరీకి ఆరు పరుగుల దూరంలో ఉండగా సచిన్ టెండూల్కర్‌ను రాంపాల్ అవుట్ చేశాడు. టెండూల్కర్ రాంపాల్ వేసిన బంతికి సెకండ్ స్లిప్‌లో సామీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. క్రికెట్ ప్రపంచ కప్ పోటీల నుంచి సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ కోసం నిరీక్షిస్తున్నాడు. వెస్టిండీస్‌పై 90ల్లో అవుట్ కావడం ఆయనకు ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు అతను టెస్టుల్లో 90 పరుగులు దాటిన తర్వాత పదో సారి అవుటయ్యాడు. వన్డేల్లో అలా అవుట్ కావడం 18వ సారి. ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా పేరు పొందిన సచిన్ టెండూల్కర్ కూడా మానవ మాత్రుడే. అతనిపై విపరీతమైన ఒత్తిడి పనిచేస్తున్నట్లు ఇటీవలి కాలంలో అవుటవుతున్న తీరు తెలియజేస్తోంది. తన సహజమైన ఆటను కూడా అతను ఒత్తిడిలో మరిచిపోతున్నట్లున్నాడు. తాను ఓ ఫీట్‌ను సాధించాల్సిన అవసరం ఉందనే భావన అతని గుండెను, మెదడును నిత్యం తొలిచి వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే తాను మరో మ్యాచ్ ఆడబోతున్నాననే అభిప్రాయంతోనే సచిన్ టెండూల్కర్ మైదానంలోకి దిగి, వందో సెంచరీ చేయాలన్న విషయాన్ని మనసులోంచి తుడిచి వేసి ఆడితే సచిన్‌కు సెంచరీ సాధించడం బహుశా, కష్టమైన పని కాకపోవచ్చు.

No comments:

Post a Comment